పూర్వము కైలాసమున పార్వతీ దేవి, పరమేశ్వరునితో ప్రియభాషణములు ఆడుచూ, “ప్రాణనాథా, భూలోకమున జనులందరు ధనార్జన కొరకు మిక్కిలి కష్టములను అనుభవించుచున్నారు. అయినను, కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులగుటకు కారణమేమి”, యని అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వునవ్వి, “దేవీ, సర్వము వైభవలక్ష్మీ దయవలననే ఉండును. సమస్త సిరిసంపదలకు ఆ తల్లియే దేవత. కావున ఈ సత్యమును గుర్తించి ఎవరైతే ఆ ఐశ్వర్యలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధింతురో, వారిపట్ల ఆ తల్లి అపార కృపాకటాక్షములు కలిగి అఖండ వైభవమును అనుభవింపగలరు. ధనమును తృణీకరించిన సంపదలు కలుగజాలవు”, అని చెప్పెను. ఇది వినిన పార్వతీ దేవి, ఈ వైభవలక్ష్మి గురించి నాకు మరింత చెప్పవలసినది అని ప్రార్థింప ఆ పరమేశ్వరుడిట్లు పలికె.
ఒకానొకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తిని గూర్చి తపస్సు చేయుచుండ, ఆ భక్తికి మెచ్చిన ఆ పరాశక్తి ప్రత్యక్షమై ఏమి కావలెనో కోరుకోయని చెప్పగా, భృగు మహర్షి “తల్లీ, వైభవకరమగు నీ రూపముతో నా కుమార్తెగా జన్మించి నన్ననుగ్రహింపవలసినది” యని ప్రార్థింప ఆ పరాశక్తి ఆతని భక్తిశ్రద్ధలకు మెచ్చి, “తథాస్తు” అని వరమిచ్చి అంతర్ధానమాయెను. తత్ఫలముగా పరాశక్తియొక్క సంపత్కర అంశ భృగు మహర్షియొక్క కుమార్తె వలె అవతరించినది. పుత్రికా వాత్సల్యముతో ముదమొందిన భృగువు ఆమెను శ్రీమహావిష్ణువునకు ఇచ్చి వివాహము చేసెను. ఆ శ్రీహరి ఆనతిమేర దేవతలందరకు వైభవమును ప్రసాదించి, వైకుంఠలక్ష్మిగా ఆరాధింపబడుతూ ఉండెను.
ఇట్లుండ భూలోకమున ఋషులందరు మహాయాగము చేయదలచి, హవిస్సును ఎవరకు ఇవ్వవలసినదో నిర్ణయింపుమని భృగు మహర్షిని వేడుకొనగా భృగువు సమ్మతించి ముల్లోకములకు పయనమాయెను. బ్రహ్మలోకమున సరస్వతితో ప్రియభాషణములాడు బ్రహ్మదేవులవారిని చూచి, తన రాకను గౌరవింపలేదని కోపగించుకుని, కైలాసమునకు యేగెను. అచటకూడా మహేశ్వరుడు ధ్యానమగ్నుడగుటచే భృగువు రాకను గమనించలేదు. మరింత కోపముతో భృగువు అక్కడ నుండి వెడలిపోయెను. చివరకు వైకుంఠము చేరగా అచట విశ్రాంతి తీసుకొనుచున్న శ్రీమహావిష్ణువును చూచి తన రాకను గౌరవింపలేదని పట్టరానికోపమునొంది, ఆ విష్ణువు వక్షఃస్థలముపై కాలితో తన్నెను. అంతయా విష్ణువు భృగువు యొక్క కోపమును శాంతపరచి పంపివేసెను. ఇది గమనించిన శ్రీమహాలక్ష్మి, తన నివాసస్థానమగు తన భర్త వక్షఃస్థలమును కాలితో తన్నినను యేమియును అనలేదని ఆగ్రహముతో వైకుంఠమువదలి క్షీరసాగరములోనికి వెడలిపోయెను. దీనితో ఇంద్రాది దేవతలందరి వైభవము క్షీణించెను. వారందరు శ్రీమహావిష్ణువు వద్దకు పోయి వేడుకొనగా, క్షీరసాగరమథనము చేయమని ఆనతిచ్చెను. మంథరపర్వతముతో మథనము చేయు సమయమున, ఆ శ్రీమహాలక్ష్మి వారిని అనుగ్రహింప తలచి, అమృతముతో పాటుగా అష్టలక్ష్మీరూపములతో వారికి వైభవమును ప్రసాదించి, తిరిగి తన ప్రాణవల్లభుడగు శ్రీమహావిష్ణువు వద్దకు చేరెను. కావున శ్రీమహాలక్ష్మికి ఇష్టమైన శ్రీమహావిష్ణువును తిరస్కరించిన ఆ యమ్మ నిలువజాలదని గ్రహింపుము.
అటులనే మానవులకు పూర్వజన్మ కర్మల వలన కూడా సిరిసంపదలు సంభవించును. ఇందుకు ఉదాహరణగా సుశర్మ గురించి చెప్పెద వినుము. ఒకానొక గ్రామమున సుశర్మయను సకలశాస్త్రకోవిదుడు కలడు. తన గురుకుల ఆశ్రమము ద్వారా పురప్రజలకు, రాజులకు, ధనవంతులకు శాస్త్రవిద్యను అభ్యసింపజేయుచూ ఉండెను. కాని ఆతని ఇంట పేదరికము ఉండెను. ఇది గమనించిన సుశర్మ భార్యయగు సుశాంత ఇట్లు పలికెను. “నాథా, మీరు విద్యను ప్రసాదించిన మీ శిష్యులలో కొందరు ధనవంతులు ఉన్నారు. మన ఇంటి వెచ్చములకొరకు వారివద్దకు పోయి కొంతధనము తీసుకురావలసినది” అని పలుకగా, సుశర్మ “యాచన చేయుట భావ్యము కాదు, పైగా సిరిసంపదలమీద ఆశ కలిగియుండుట మంచిదికాదు. అయినను మనకు కావలసిన సంపదలు ఆ వైభవ స్వరూపమగు శ్రీమహాలక్ష్మి ఇవ్వగలదుగాన ఆ యమ్మను గూర్చి యాగము చేసెద”నని చెప్పి యాగము చేయసాగెను. సుశర్మ చేసిన యాగమునకు సంతుష్టురాలైన శ్రీమహాలక్ష్మి ప్రత్యక్షమై “నేటి రాత్రి నీ యింట బంగారు కాసుల వర్షము కురిపించెద”నని వరమిచ్చి అంతర్ధానమాయెను. సుశర్మ ఆనందముగా ఈ విషయము సుశాంతకు తెలిపి రాత్రంతా జాగారము చేయుచూ వేచిచూచెను. అలా చూస్తూ ఉండగా తెల్లవారినది. సంపదవర్షం రాలేదని గ్రహించిన సుశర్మ, భార్యను పేదరికములో ఉంచినందుకు మిక్కిలి దుఃఖమునొంది ప్రాయోపవేశము చేయదలచి ఇంటినుండి బయలుదేరెను. ఇంటి బయట మలిన వస్త్రములతో, కాంతిహీనమైన ఒక స్త్రీ కనిపించినది. సుశర్మ నీవెవరని అడుగగా ఆ స్త్రీ ఇట్లు పలికెను. “నీ యాగమునకు మెచ్చి నీ యింట కనకవర్షము కురిపించ నే వచ్చితిని. కానీ నీ యింట గల జ్యేష్ఠాదేవి నన్నువారించెను. నీ పూర్వజన్మలలో పుణ్యకార్యములు, దాన ధర్మములు చేయని కారణమున, ఈ జన్మమున నీకు సంపద కలుగకయున్నదని తెలిపినది.” ఇది వినిన సుశర్మ, తను లేకపోయిన తన భార్యా బిడ్డలకు సంపదలు కలుగగలవని గ్రహించి, సన్యాసాశ్రమము స్వీకరించెను. ప్రతిగా కరుణించమని శ్రీమహాలక్ష్మిని ప్రార్థింపగా, ఆతని భక్తియుక్తులకు సంతోషమునొంది శ్రీవైభవలక్ష్మి ఆ యింట వైభవములను కటాక్షించెను.
ఓ పార్వతీ దేవీ ! ఇదియే కాదు. ఆ శ్రీవైభవలక్ష్మి అనుగ్రహమును గుర్తింపక, తమకున్న సిరిసంపదలు తమవలన మాత్రమే వచ్చెనని అహంకరించినను ఆ తల్లి సహింపజాలదు. ఇందుకు ఉదాహరణగా నీకు మరొక కథ చెప్పెద వినుము.
ఒకానొక గ్రామమున శీల, సుశీల, గుణశీల, విశాల అను నలుగురు అక్కచెల్లెళ్ళు ఉండేవారు. వీరు శ్రీవైభవలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించుచూ ఉండెడివారు. వారి సౌభాగ్య ప్రభావము వలన వారికి ధర్మనిష్ఠులు, సంపన్నులైన భర్తలు లభించెను. శీల భర్త శాస్త్రపాండిత్యము కలవాడు. సుశీల భర్త మంచి బాహుబలము కలవాడై మహారాజు వద్ద సైన్యాధికారము చేయుచుండెను. గుణశీల భర్తకు వర్తకము పట్ల మంచి అవగాహన ఉండెను. విశాల భర్త ఊరి ప్రజలకు ధర్మము బోధించుచూ తగు రీతిలో ఆర్థిక సహాయము చేయుచుండెను. కాలము గడువగా వారి భర్తలకు అహంకారము, దురాశలు, దుర్వ్యసనములు మొదలాయెను. వారు తమ వైభవము అంతా తమ ప్రతిభ వలననే వచ్చినది గానీ లక్ష్మీకటాక్షము కాదని వాదించుచూ దైవవిరుద్ధముగా ప్రవర్తించెడివారు. ఇందుకు కోపగించిన శ్రీమహాలక్ష్మి వారి సంపదలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించెను. శీల భర్తకు పాండిత్య స్తబ్దత దాపురించి సభలలో అవమానములను పొంది క్రమముగా నిర్ధనుడాయెను. సుశీల భర్త బలగర్వముచే పురజనులతో కలహములు పెట్టుకొనుటచే మహారాజు అతనిని సైన్యాధికార పదవి నుండి తొలగించెను. గుణశీల భర్త వ్యాపారములో మోసము చేయుచూ దొరికిపోయి జరిమానా కింద తన సంపదను మొత్తం అప్పగించవలసి వచ్చినది. విశాల భర్త చెడు స్నేహములు, చెడు వ్యసనములకు అలవాటుపడి తన సంపదను పోగొట్టుకొనెను.
వారి భర్తల దుస్థితికి, తమ పేదరికానికి దుఃఖించుచున్న ఆ నలుగురు అక్కాచెల్లెళ్ళను చూసి శ్రీమహాలక్ష్మికి కనికరము కలిగి, అనుగ్రహింప తలచి, ఒక వృద్ధి స్త్రీ రూపములో వారి వద్దకు వచ్చెను. ఆమెను చూసిన అక్కాచెల్లెళ్ళు తమ బాధను చెప్పగా, ఆ వృద్ధి స్త్రీ “మీ వైభవము తిరిగిమీకు వచ్చుటకు మీరు శ్రీవైభవలక్ష్మీ వ్రతమును ఆచరించరింపుము. అ వ్రతవిధానమును చెప్పెద వినుము. వ్రతమును నాలుగు, తొమ్మిది, పదకొండు లేక ఇరవైవొక గురువారములు లేక శుక్రవారములు చేసి చివరి శుక్రవారమురోజున ఉద్యాపన చెప్పి కనీసము అయిదుగురు ముత్తైదువులకు వాయన తాంబూలములు ఇవ్వవలెను. వ్రతము సాయంత్రము సూర్యాస్తమయము తరువాత ఆరంభించవలెను. వ్రతము చేయురోజు ఉదయము కాలకృత్యములు తీర్చుకుని, స్నానము చేసి, ఇంటికి ఈశాన్యమును శుభ్రముచేసి, ఆవుపేడతో అలికి, ముగ్గులు పెట్టి, పూజా స్థానమును తయారు చేసుకోవలెను. సాయంకాలము వరకు ఉపవాసము ఉండి, ఈశాన్యమున కొత్త రవికలబట్ట పరచి దానిపై బియ్యము పోసి, దాని పై కలశమును పెట్టి, అందులో నీరుపోసి, తమ ఆర్థిక స్తోమతను బట్టి నాణెములను వేసి, ఫలవృక్షముల ఆకులువేసి, పైన ఒక కొబ్బరికాయ పెట్టి కలశ స్థాపన చేయవలెను. ఆ కలశము పై శ్రీవైభవలక్ష్మిని ఆవాహనము చేసి పూజ చేసి, తీపి పదార్థములు నివేదనముగా పెట్టవలెను. ఉద్యాపన చెప్పు రోజు పూజ అయిన తరువాత, ఆ కలశములోని నీటిని వేప, తులసి మొదలగు దైవవృక్షములలో పోయవలెను. ధనాపేక్ష కలిగిన వారు ఆ కలశములోని నీరును కొంచెము తీర్థమువలె స్వీకరించవలెను. అందులోని నాణెమును ఇంటిలో భద్రప్రచుకొనవలెను. కలశము క్రింది బియ్యముని పక్షులకు వేయవలెను.” అని వ్రతవిధానమును తెలిపి వెడలిపోయెను.
ఇది వినిన ఆ అక్కాచెల్లెళ్ళు ఆనందముగా తమ భర్తలతో కలసి శ్రీవైభవలక్ష్మీ వ్రతమును ఆచరించెను. ఆ వ్రత ప్రభావము వలన, శీల భర్త యొక్క పాండిత్యము తిరిగి గుర్తింపబడి గౌరవ మర్యాదలు కలిగినవి. సుశీల భర్త యొక్క బలమెరిగిన మహారాజు తిరిగి సైన్యాధికారమును ఇచ్చెను. గుణశీల యొక్క భర్త తిరిగి వ్యాపారమున ప్రతిభ కనబరచి సంపదను పొందెను. విశాల భర్త తన చెడు వ్యసనములను గుర్తించి మంచివాడిగా మారి, మరల పురప్రజలకు సన్నిహితుడాయెను.
కావున ఓ పార్వతీ దేవీ ! వైభవము, ఐశ్వర్యములు కలుగజేయు శ్రీవైభవలక్ష్మీని ఆరాధించుటవలన సిరిసంపదలు కలుగును” అని పరమేశ్వరుడు పలుకగా పార్వతీదేవి ఆనందముగా నమస్కరించినది.